- నిర్మల్ – భైంసా రహదారిపై మహిళల రాస్తారోకో
- నాయకులు కనిపించుట లేదంటూ ఫ్లెక్సీలు
- ఆర్డిఓను అడ్డుకున్న మహిళలు
- రాత్రి వరకు కొనసాగుతున్న నిరసన
నిర్మల్, బతుకమ్మ : పురుగుల మందు తాగి ప్రాణాలైనా అర్పిస్తాం కానీ తమ గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకొని తీరుతామంటూ గుండంపల్లి, దిలావర్పూర్, కంజల్, లోలం గ్రామాలకు చెందిన మహిళలు రోడ్డెక్కారు. తమ గ్రామాలలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ధని 124 రోజులుగా రిలే నిరహర దీక్షలు చేస్తుంటే ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదంటు మంగళవారం నిర్మల్- బైంసా 44వ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన పాపానికి దానిలోనే పురుడు పోసుకున్న బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావులను కూడా వదిలిపెట్టమంటూ మహిళలు నినాదాలు చేశారు.

ఫ్యాక్టరీ యజమాన్యం వద్ద అక్రమంగా డబ్బులు సంపాదించుకొని తమ గ్రామాలను విషవాయువుగా మార్చేందుకు మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలలో నిర్మించడం అంటే తమ బతుకుపై మట్టి పోసినట్లే కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు మహిళలు. తమ ఓట్లతో గెలిచిన నాయకులకు సిగ్గు శరం ఉంటే వెంటనే ఆ ఫ్యాక్టర్ ని నిలిపివేయాలని లేదంటే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ ధర్నాతో రోడ్డుపై వందలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఫలితంగా పోలీసు శాఖ గొల్లమాడ, బీరవెల్లి మీదుగా రాకపోకలను కొనసాగించారు. నిరసనలో భాగంగా మంగళవారం మండల బంద్ కు పిలుపునిచ్చారు. ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా వినకపోగా తమ రాస్తారోకో కొనసాగిస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపే దాకా తమ నిరసనలు కొనసాగిస్తామని వారంటున్నారు. దీంతో ఫ్యాక్టరీ వైపు వెళ్లే మార్గం పోలీసు దిగ్బంధంలోకి వెళ్ళింది. నిరసనకారులకు నచ్చజెప్పేందుకు నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి వెళ్లారు. ఆమెను మహిళలు ఘెరావ్ చేసి నిరసన వ్యక్తం చేశారు. గత నెలరోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తూ తమ వ్యతిరేకత చాటుతున్నా ప్రజాప్రతినిధులు తమ గోడును పట్టించుకోనందుకు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావు కనిపించటం లేదంటూ వారి చిత్రపటాలతో ఫ్లకార్డులు చేత పట్టుకొని నిరసన వెలిబుచ్చారు.తమ గ్రామం లో నిరవధిక రిలే దీక్ష చేస్తున్న పట్టించుకోని మీరు ఈరోజు మేమందరం రోడ్డుపైకి వస్తేనే గుర్తొచ్చామా అని నిర్మల్ ఆర్డీవోను మహిళలు చుట్టుముట్టి నిలదీశారు.ఇథనాల్ ఫ్యాక్టరీని నిలిపివేయాలని లేదంటే తమ సహనానికి హద్దులు ఉంటాయని, అతి మించితే ఏం జరుగుతుందో చెప్పలేమని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. పోలిస్ శాఖ500 మంది పోలీసు తో బందోబస్తు చెపట్టారు.నాలుగు గ్రామాల ప్రజలతో నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల చర్చలు జరుపుతున్నారు.

