ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే పోరు తప్పదు

0 1,199

– ఏరియా మహాసభలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు 

రుద్రూర్, బతుకమ్మ  : జమిలి ఎన్నికలు ఫెడరలిజానికి గొడ్డలి పెట్టు అని, రాష్ట్రాల హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మండిపడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయకపోతే భవిష్యత్తు ఉండదన్నారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో సీపీఎం ఏరియా 2వ మహాసభ పద్మశాలి ఫంక్షన్ హాల్, నామ్ శంకర్ ప్రాంగణంలో లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించారు. మహాసభ సందర్భంగా బస్టాండ్ చౌరస్తాలో పార్టీ జెండాను సీనియర్ నాయకులు నాగనాధ్ ఆవిష్కరించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ ప్రతినిధుల సభలో ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ మూడేళ్ల కాలంలో పోరాటాలు, ఉద్యమాలు చేసిన నివేదిక ప్రవేశపెట్టారు. నివేదికపై సభ్యులు చర్చ చేసి, భవిష్యత్ పోరాటాలను రూంపొందించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. జమిలి ఎన్నికల పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరు తప్పదని హెచ్చరించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో పార్టీ నాయకులు గంగాధర్, సాయ గౌడ్, రాములు, సాయిబాబు, లక్ష్మణ్, సుశీల తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.