- అప్పుల వేధింపులతోనే..
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ లో భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం వెలుగు చూసింది. గాయత్రి నగర్ లో అద్దె ఇంటిలో ఉంటున్నపులిశెట్టి శ్రీనివాస్ (52), మమత (48) లు ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డారు. ప్రింటింగ్ ప్రేస్ లో పనిచేసే శ్రీనివాస్ కు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల కుమార్తెకు వివాహం చేయగా ఇద్దరు కుమారులు ఉపాధి నిమిత్తం గల్ప్ వెల్లినట్లు తెలిసింది. నగరంలోని కోటగల్లిలో ఉన్న ఇంటిని అమ్ముకుని ఇటీవల గాయత్రి నగర్ లో అద్దె ఇంటిలో జీవనం కొనసాగిస్తున్నారు. గత రాత్రి అప్పుల వారు వేదించినట్లు ప్రాథమికంగా తెలిసింది. అప్పుల వారు వేదించడంతో పరువు పోయిందని దంపతులు ఉరివేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై నగర సిఐ శ్రీనివాస రాజును వివరణ కోరగా దంపతుల ఆత్మహత్య విషయం తెలిసిందని ప్రాథమికంగా వివరాలు తెలియదని తెలిపారు. అధిక వడ్డీ వసూళ్లపై జిల్లా పోలీస్ కమిషనర్ సీరియస్ గా ఉన్నా వడ్డీ వ్యాపారుల వేధింపుల వల్ల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు.
