26.2 C
Hyderabad
Monday, August 3, 2026

హాస్పిటల్స్ మాఫియా తీరు మితిమీరుతోంది

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో హాస్పిటల్స్ మాఫియా తీరు మితిమీరుతోందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కన్నెత్తి కూడా ప్రైవేట్ హాస్పిటల్ వైపు చూడడం లేదని ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సమితి నాయకులు తిరుపతి హనుమాన్లు(బుజ్జి) అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ బాధితుల సమితి ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.   ఈ సందర్భంగా బాధితుల సమితి నాయకులు తిరుపతి హనుమాన్లు(బుజ్జి) మాట్లాడుతూ గతంలో విజయ హాస్పిటల్ లో ఒక మహిళకు డాక్టర్ లేకుండానే కాంపౌండర్ టెస్టులు రాసిన సంగతి తెలిసిందే… ఈ మధ్యకాలంలో కంటి వైద్య నిపుణుడు కృష్ణ మూర్తి మూడు రోజులపాటు అందుబాటులో లేకున్నా ఆయనకు చెందిన శ్రీరామ, గిరిజ నేత్ర వైద్యశాలల్లో రోగులకు ఏ ఆటంకం లేకుండా చికిత్స కొనసాగిందన్నారు. కాంపౌండర్లే ఒక్కో రోగి వద్ద ఓపి రూ.350కిపైగా వసూలు చేస్తూ టెస్టులు రాస్తూ వైద్యం అందిస్తున్నారని వైద్యారోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు అందిందని, దాంతో వెంటనే ఆస్పత్రి లో తనిఖీలు చేపట్టారని తెలిపారు.  ఫిర్యాదులు వస్తే తప్ప ప్రైవేట్ ఆస్పత్రులలో తనిఖీలు చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ మాఫియా రాజ్యమేలుతుందని, ఎవరి స్వలాభం కోసం అధికారులు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. పేద మధ్యతరగతి ప్రజలను  కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ అవసరం లేకున్నా పదివేల రూపాయల వరకు టెస్టులు రాస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయని పదుల సంఖ్యలో ప్రధాన వార్తాపత్రికలలో నిత్యం వార్తలు వస్తున్నా కానీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కాంపౌండర్లు వీకెండ్ డాక్టర్లుగా చలామణి అవుతున్నారని అన్నారు. సాధారణ ఆస్పత్రుల నుంచి సూపర్, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు కాంపౌడర్లదే హవా కొనసాగుతోందని మండిపడ్డారు. గర్భిణీ స్త్రీలు ప్రైవేట్ ఆస్పత్రులకు వస్తే సర్జరీ తప్ప నార్మల్ డెలివరీలు చేయలేని స్థితిలో ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయని…. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడి ప్రైవేట్ ఆస్పత్రుల మాఫియా పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీకాంత్, ఈర్ల రాజ్ గణేష్, ఆజగిరి రాకేష్, నల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article