- పండగ వేళ అల్లర్లకు పాల్పడితే ఊపేక్షించం
- మద్యం దుకాణాల మూసివేత
- నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఈ నెల 14న జరిగే హోళి పండగను ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబసమేతంగా జరుపుకోవాలని నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య ప్రజలకు సూచించారు. గురువారం కమీషనరేట్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య మీడియాతో మాట్లాడుతు… పోలీస్ కమీషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉందని తెలిపారు. అందులో భాగంగా యాక్ట్ 22 ప్రకారం.. బహిరంగ ప్రాంతాల్లో ఇతరులను ఇబ్బందులు పెట్టడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, అల్లర్లకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. హోళీ సందర్భంగా ఆరోగ్యకరమైన సంప్రదాయ రంగులను వినియోగించాలని ఆయన అన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు వేడుక జరుపుకోవాలని చెప్పారు. ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు చల్లటం, రంగు నీళ్లను పోయడం సరికాదని అన్నారు. బైక్లతో ర్యాలీలు చేయడం, రహదారులపై ఇష్టం వచ్చినట్లు తిరగడం చేయవద్దని హితవు పలికారు. హోళీ పండగ నాడు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దని అన్నారు. మహిళల పట్ల గౌరవంగా నడుచుకోవాలన్నారు. కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు. హోళి పండగ నేపథ్యంలో గురువారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలను మూసివేసి … శనివారం సాయంత్రం 6 గంటలకు తెరుస్తారని తెలిపారు. ఈ విషయంలో కఠినంగా నిబంధనలు అమలు చేయడం జరుగుతుందని చట్టాన్ని అతిక్రమించేవారిపై చర్యలు తప్పవని తెలిపారు.
