. . . లేకపోతే రైతుల సమస్యలపై బీజేపీ పోరు
. . . జిల్లా అధికారులకు బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అల్టిమేటం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంపై భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు శనివారం వారు పార్టీ ముఖ్య నేతలతో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ఇతర అధికారులతో సుమారు గంట సమయం పాటు సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సంధర్బంగా దినేష్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సి వస్తోందని, నిరాశతో అన్నదాతలు, ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మొన్న మోపాల్ మండల పర్యటనలో లారీల కొరత గురించి అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వారు స్పందించి లారీలు ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంకా సమస్యలు వేధిస్తున్నాయని తెలిపారు. సుమారు 180 దొడ్డు రకం ధాన్యం లారీలు రైస్ మిల్లుల వద్దే అన్-లోడింగ్ కాక నిలిచిపోయాయని, వెంటనే రైస్ మిల్లర్లతో మాట్లాడి అన్-లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని అడిషనల్ కలెక్టర్ చెప్పారన్నారు. బోధన్లోని కొన్ని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని కోరుతూ జిల్లా అధికారులను కోరగా, వారు ఈ విషయాన్ని సివిల్ సప్లైస్ కమిషనర్ ని అడగాలని సూచించడంతో వెంటనే జిల్లా అధ్యక్షులు దినేష్ సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీందర్ తో ఫోన్లో మాట్లాడగా, ఆయన సానుకూలంగా స్పందించి, వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ చొరవతో వెంటనే కేటాయింపులు జరిగినందుకు గాను, దినేష్ సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల దుస్థితిని వివరించగా సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్ రాబోయే రెండు మూడు రోజుల్లో (మంగళవారం లోపు) జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ మంగళవారం లోపు కొనుగోలు ప్రక్రియ వేగవంతం కాకపోయినా, రైతుల సమస్యలు పరిష్కారం కాకపోయినా… భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, కలెక్టరేట్ ముట్టడికి వెనుకాడబోమని దినేష్ పటేల్ ఈ సందర్భంగా తెలియజేశారు.