బతుకమ్మ, మాచారెడ్డి: అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనం కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మాచారెడ్డి మండలం అక్కాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గత ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారికి పథకాలు అమలు కొరకు గ్రామసభలో జాబితాలను చదివి వినిపించడం జరుగుతుందని, అట్టి వాటిలో అభ్యంతరాలు ఉంటే గ్రామసభలో తెలియజేయాలని అన్నారు. ఇంతకు ముందు దరఖాస్తు సమర్పించనీ వారు ప్రస్తుత గ్రామసభల్లో ఏర్పాటుచేసిన కౌంటర్ లలో దరఖాస్తులు సమర్పించవచ్చనీ తెలిపారు. అట్టి దరఖాస్తులను తదుపరి పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.