– ప్రతి గింజ ను కొంటాం
– సన్నారకాలకు బోనస్ అందిస్తాం
– యువత ఆధునిక వ్యవసాయం చెయ్యాలి
– మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బతుకమ్మ, నవీపేట్ : మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ను బంగారు తెలంగాణ గా మారుస్తామని చెప్పి అప్పుల తెలంగాణ గా మార్చారని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే జిల్లాలో
జాబ్ లు వచ్చేవరకు యువత ఆధునిక వ్యవసాయం చేసి కూరగాయలు పండిస్తే తనవంతుగా సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. మండలం లోని నాగేపూర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి ధాన్యపు గింజను కొంటామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, స్వార్ధ రాజకీయాల వలన రైస్ మిల్లర్లు కోట్ల రూపాయల సీఎంఆర్ బియ్యం బాకీ ఉన్నారని, వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 90 శాతం సీఎంఆర్ బియ్యం తిరిగిచ్చిన రైస్ మిల్లులకు ధాన్యం కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్నరకం బియ్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. విజయ డైరీ పాల రైతులకు లీటర్ కు 10 రూపాయలు అధికంగా అందిస్తున్నామని, జిల్లాలో విజయ డైరీ 100 కోట్ల అప్పులలో సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి 50 కోట్లు తీర్చినామని, ప్రజలు నాణ్యమైన విజయా డైరీ పాలను తాగాలని కోరారు. కల్తీ ఆహారాలపై చర్యలు చేపడతామని ఈ కల్తీ ఆహారాలతో అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కూరగాయలు, పండ్లు, ఇతర అవసరాల కొరకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా యువత ఆధునిక వ్యవసాయం చేసి కూరగాయలు పండిస్తే తనవంతుగా ప్రభుత్వం నుండి సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తానని హామి ఇచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో నిరుద్యోగులకు జాబులు ఇవ్వలేదని, గ్రూప్ 1 పరీక్షలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి యువకులకు అండగా ఉండి జాబ్స్ ఇస్తున్నారని తెలిపారు. జాబ్ లు వచ్చే వరకు యువత వ్యవసాయం చేసి సమాజానికి తొడుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్, జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రంచందర్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, కిషన్ రావు, మోస్ర సాయి రెడ్డి, బాలరాజ్ గౌడ్, సంజురావు, భగవాన్, సంజీవరెడ్డి, ప్రసన్న, గోపాల్, మూస, షేక్ బాబు, సొసైటీ డైరెక్టర్లు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
