బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని డోన్ కల్ గ్రామంలో గురువారం పశువులకు (ఆవులు, గేదెలకు) ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల వేయటం జరిగింది. సందర్భంగా జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. రోహిత్ రెడ్డి పర్యవేక్షించి రైతులకు గాలికుంటు వ్యాధి పట్ల తగు సూచనలు ఇచ్చారు. జీవాలు గాలికుంటు వ్యాధి బారిన పడడం వల్ల నోటిలో పుండ్లతో చొంగ కారటం, కాలి డెక్కలలో పగుళ్లు ఏర్పడి నడవలేకపోవటం, పాల ఉత్పత్తి తగ్గిపోవటం, చూడి పశువుల్లో అబార్షన్లు అవ్వటం వంటి లక్షణాలు ఏర్పడతాయని తెలియజేశారు. కావున పాడి రైతులు ముందు జాగ్రత్త చర్యలలో బాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా తమ పశువులకు ఇప్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాడి రైతులు టి. అనిల్, ఏలేటి రాజేశ్వర్, టి.అశోక్, బి.అనిల్, పశువైద్య అధికారి డా.గౌతమ్ రాజు, సిబ్బంది.తైసేం, వెటర్నరీ అసిస్టెంట్ జ్యోతి, ప్రభాకర్, జమెల్ తదితరులు పాల్గొన్నారు.
