. మున్సికార్మికురాలి అకౌంట్ నుంచి రూ.4లక్షలు విత్ డ్రా
. పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: తనకు రూ.5లక్షల లోన్ ఇప్పిస్తానని బ్యాంక్ ఏజెంట్ నమ్మించడంతో అవసరమైన పత్రాలు ఆయనకు ఇచ్చానని, లోన్ మంజూరై నా అకౌంట్ లో పడగానే తనకు తెలియకుండా సదరు ఏజెంట్ రూ.4లక్షలు విత్ డ్రా చేసుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని గాజుల్ పేట్ బోయిగల్లీకి చెందిన మల్లమ్మ నిజామాబాద్ మున్సిపాలిటీలో పని చేస్తోంది. ఆమెకు పరిచయం ఉన్న శివ అనే వ్యక్తి బ్యాంకు రుణం ఇప్పిస్తానని చెప్పడంతో అవసరమైన డాక్యుమెంట్లు, బ్యాంకు వివరాలు అతడికి ఇచ్చింది. నవంబర్ 30వ తేదీన రూ.5లక్షల రుణం మంజూరై ఆమె అకౌంట్ లో జమకాగా, ఆమెకు తెలియకుండానే శివ రూ.4లక్షలు విత్ డ్రా చేసుకున్నాడు. ఈ విషయమై మల్లమ్మ శివను ప్రశ్నిస్తే తనకు డబ్బులు రావడానికి టైం పడుతుందని చెబుతూ నాలుగు రోజులుగా దాటవేస్తున్నాడు. దీంతో బాధితురాలు రెండో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

