నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసికందును విక్రయించిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఒకటో టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఎస్ హెచ్ ఓ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ షరీఫ్, సయ్యద్ సీమా లు సహజీవనం చేస్తూ బిక్షాటన వ్రుత్తిగా జీవించేవారు. ప్రస్తుతం వారికి తొమ్మిది సంవత్సరాల బాబు ఉండగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ నివశిస్తున్నారు. ఇటీవల వారి వద్ద ఉండవలసిన బాబు కనిపించకపోవడంతో విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో సిహెచ్ సీ అధికారులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సయ్యద్ షరీఫ్, సీమాలను అదుపులోకి తీసుకుని విచారించడంతో మాలపల్లి కి చెందిన రెహనా బేగం, మహమ్మద్ సర్ తాజ్ అన్సారీ అనే వ్యక్తులు మధ్యవర్తిగా వ్యవహరించి ముజాహిద్ నగర్ చెందిన పర్నిచర్ వ్యాపారి సలాఉద్దీన్ ఖురేషీ అనే పిల్లలు లేని వ్యక్తికి బాబును రూ.1.20 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1,05,000 స్వాధినం చేసుకున్నారు. బాబును చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు అప్పగించారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
