. . . సీఎం వెంటనే రాజీనామా చేయాలి
. . . సీపీ ని వెంటనే సస్పెండ్ చేయాలి
. . . మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కరీంనగర్, బతుకమ్మ :
పీఎంజె జ్యువెల్లర్స్ ఘటనలో గాయపడిన బాధితులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం తక్షణమే అందించాలని, గాయపడిన నలుగురి బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పీఎంజె జ్యూవెలర్స్ లో జరిగిన దారుణ కాల్పుల ఘటనలో గాయపడిన సిబ్బందిని వేంకటాద్రి హాస్పిటల్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకా రవిశంకర్ పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్ నగర నడిబొడ్డునే గన్ కల్చర్ పెరగడం, నేరస్తులు రెచ్చిపోవడం ప్రభుత్వ పాలన పూర్తిగా చేతులెత్తేసిందనే దానికి స్పష్టమైన నిదర్శనమని మండిపడ్డారు. కరీంనగర్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 700 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను బలోపేతం చేసిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సమయంలో ఇంటర్సెప్టర్ విధానం ద్వారా ప్రతి చౌరస్తాలో హోమ్ గార్డ్, కానిస్టేబుల్, ఎఎస్సై లను నియమించి శాంతి భద్రతలు కాపాడేవారని గుర్తుచేశారు.

ప్రస్తుతం సీపీకి ప్రజా భద్రతపై పట్టింపు లేకుండా కేవలం జల్సాలు మాత్రమే మిగిలాయని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, రాష్ట్రంలో చట్టవ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపించారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోమ్ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని, కాల్పులకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలన్నారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని, నేరస్తులకు భయమే లేకుండా పోయిందని అన్నారు. అసెంబ్లీలోనే సీపీ పనితీరుపై హెచ్చరించానని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఈరోజు జరిగిన ఘటన ఆ నిర్లక్ష్యానికి బలమైన సాక్ష్యమని విమర్శించారు. ప్రజల భద్రతను కాపాడలేని ప్రభుత్వం అధికారంలో ఉండే హక్కు లేదని, వెంటనే కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
