. . . అక్రమాలకు చోటులేని ఎన్నికల కోసం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు.
. . . పారదర్శక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులకు దిశా నిర్దేశం.
. . . స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే ధ్యేయం.
. . . జిల్లా ఎస్పి యం.రాజేష్ చంద్ర.
బాన్సువాడ, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్యన జరిపేందుకు జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, ఐపీఎస్ చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం బాన్సువాడ, బిచ్కుంద పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ సందర్శించి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై యస్ఐ, సిఐ డిఎస్పి అధికారులతో సుధీర్గంగా చర్చించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవి కావున ప్రతి ఓటరు తన ఓటు హక్కును ఎటువంటి ఆటంకాలు, ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధముగా పోలీసు యంత్రాంగం అంకితభావంతో పనిచేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాల ద్వారా భద్రత ఏర్పాట్లు చేయాలని బాన్సువాడ డిఎస్పీ కి సూచించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ప్రతీ పోలీసు సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ప్రజలతో సమన్వయం చేసుకుంటూ వారిలో మరింత భద్రతా భావాన్ని పెంపొందించాలని సూచించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని సాంకేతిక భద్రతా వనరులను సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్ని అయినా సహించేది లేదని బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాల్లో అక్రమ మద్యం, నగదు పంపిణీ వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. నిష్పక్షపాతమైన ఎన్నికల నిర్వహణ కోసం నిరంతర తనిఖీలు చేపట్టాలని, ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. ప్రజలందరూ ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా, ధైర్యంగా ఓటు వేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. శాంతియుత, నిష్పక్షపాత, పారదర్శక వాతావరణంలో ఎన్నికల నిర్వహణనే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో అవసరమగు అన్ని బందోబస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల విజయవంతానికి తోడ్పడాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

