నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఉత్సాహభరిత వాతావరణంలో రైతు విజయోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వానాకాలం — 2025 సీజన్ కు సంబంధించి ముందస్తు పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భంగా మంగళవారం రైతు సంబరాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్దకు అన్నదాతలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఉత్సాహంగా ఈ సంబరాలలో పాల్గొన్నారు. రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రైతు వేదిక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించారు. డిచ్పల్లి మండలం యానంపల్లి రైతు వేదిక నుండి ఆదర్శ రైతులతో కలిసి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వీరాస్వామి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, మండల వ్యవసాయ అధికారిణి మాధురి, సొసైటీల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
