- విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలు ప్రతి డీలర్ అమ్మాలని డీలర్లకు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రయివేట్ విత్తన డీలర్లతో జిల్లా కలెక్టరేట్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రయివేట్ కంపెనీల ఆకర్షణీయమైన ప్రకటనలతో, మోసపూరిత మాటలతో ప్రయివేట్ విత్తనాలు అమ్మకుండా ప్రభుత్వానికి సంబందించిన సంస్థ విత్తనాలు అమ్మాలని సూచించారు. ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటుందన్నారు. పంటల కొనుగోలు చేస్తుందని ధాన్యానికి ఎన్నడు లేని విధంగా రూ.500 బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ధాన్యం గతంలో లాగా కాకుండా తరుగు లేకుండ కొనుగోలు చేస్తుందని అన్నారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం రైతులను ఆదుకుంటే విత్తనాలలో మాత్రం ప్రయివేట్ కంపెనీల అజమాయిషి పెరిగి రైతులకు నష్టం జరుగుతుందన్నారు. రైతులకు నష్టం జరగకుండా మంచి విత్తనాలను రైతులకు అందించాల్సిన బాధ్యత ప్రయివేట్ డీలర్ల మీద ఉందన్నారు. సంస్థ కు రైతులకు మధ్య ప్రైవేట్ డీలర్లు వారధిగా ఉండాలని సూచించారు. విత్తనాభివృద్ధి సంస్థ రైతుల కోసం నాణ్యమైన విత్తనాలను అందించడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ అని తెలిపారు. ఈ సంస్థను కాపాడాల్సిన బాధ్యత మీ మీద కూడా వుందన్నారు. ఉమ్మడి జిల్లాలో వున్నా ప్రతి ప్రైవేట్ డీలర్ 20 క్వింటాళ్ల విత్తనాలు అమ్మాలని తెలిపారు. ఇప్పటికే విత్తనాల విషయంలో ప్రైవేట్ విత్తన కంపెనీల పెత్తనం పెరిగిపోయిందన్నారు. దీని వలన విత్తనాల ధరలు పెరగడం నష్టం జరిగినప్పుడు రైతులను ఆదుకునే దీనుడు లేకుండా పోయిందన్నారు. ఈ సమావేశం లో ఉమ్మడి జిల్లా డీలర్లు, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, భీమగల్ ఏడీఏ సాయికృష్ణ, టీజీఎస్ డీసీ మార్కెటింగ్ మేనేజర్ రాజీవ్, ఆర్ఎం రఘు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

