- బిక్కు బిక్కుమంటున్న కార్మికులు
రుద్రూర్, బతుకమ్మ: కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్పోరేట్ విధానాల వల్ల చేతి వృత్తులు నాశనమయ్యాయని రెడీమేడ్ రూపంలో దుస్తులు కుట్టే దర్జీలకు పని లేకుండా పోయిందని, టైలర్ వృత్తి మీద ఆధారపడి జీవించే కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని టైలర్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రుద్రూర్ మండల కన్వీనర్ మేటువారి నరేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అంతర్జాతీయ టైలర్స్ డే దినోత్సవం సందర్భంగా రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో టైలర్ వృత్తిని కాపాడాలని శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మేటువారి నరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏండ్లు దాటిన టైలర్ కార్మికుడికి నెలకు రూ 10వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పూర్తి సబ్సిడీతో కుట్టు మిషన్లు, ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, అహమద్, లతీఫ్, ఫెరోజ్, మహబూబ్, తాహెర్, అల్మాస్, ఆరీఫ్, గోరే బాబు తదితరులు పాల్గొన్నారు.
