. . . ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యం
. . . మహిళల అభ్యున్నతే నా రాజకీయ లక్ష్యం
. . . టీఆర్ఎస్ జెండా ఆవిష్కరనలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
మొయినాబాద్, బతుకమ్మ :
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజల ఆశయాలు పూర్తిగా నెరవేరలేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ హక్కులను పరిరక్షించడం, ప్రజల సమస్యల పరిష్కారమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మొయినాబాద్లో శనివానం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కవిత అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె పలు రాజకీయ, సామాజిక అంశాలపై మాట్లాడారు. మొయినాబాద్, చేవెళ్ల ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కవిత, 111 జీవో కారణంగా స్థానిక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 111 జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. 120 గ్రామాలకు సంబంధించిన ఈ జీవో తొలగిస్తే రైతులకు భూములపై మంచి ధర లభిస్తుందని, కుటుంబ అవసరాల కోసం భూమి విక్రయించినా సరైన ఆదాయం పొందగలరని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి విలువ వంద కోట్ల రూపాయల వరకు పలుకుతోందని పేర్కొన్న ఆమె, 111 జీవో ఎత్తివేతపై అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం లేదని విమర్శించారు.

రియల్ ఎస్టేట్ రంగంపై మాట్లాడుతూ, తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా తెలుసునని చెప్పుకున్న “గుంపు మేస్త్రీ” ఆ రంగాన్నే దెబ్బతీశాడని ఆరోపించారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల, మొయినాబాద్ ప్రజలు ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రక్షణ సేనలో పెద్ద సంఖ్యలో మైనార్టీలు చేరుతున్నారని, వారి చేరికతో పార్టీ మరింత బలపడిందని చెప్పారు. గంగా-జమునా తహజీబ్ సంస్కృతిని దెబ్బతీయాలని ప్రయత్నించే శక్తులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. మహిళల అభ్యున్నతే తన రాజకీయ లక్ష్యమని పేర్కొన్న కవిత, తెలంగాణ ఏర్పడితే మహిళల జీవితాలు మారుతాయని భావించినా ఆశించిన స్థాయిలో మార్పులు రాలేదని అన్నారు. ఒక మహిళగా, సోదరిగా ప్రజల సమస్యలు తనకు తెలుసని, మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని పేర్కొన్న ఆమె, తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు అవసరమైన ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎలాంటి గ్యారంటీలు లేకుండానే రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే విధానాన్ని అమలు చేస్తామని వెల్లడించారు.

