ఏర్గట్ల, బతుకమ్మ: తాళ్లరాంపూర్ గ్రామస్తులు ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ను సోమవారం ముట్టడించారు. శీరామనవమి రోజున తమను వీడీసీ సభ్యులు రామాలయం నుంచి బహిష్కరించారని గ్రామాభివృద్ధి కమిటీపై గౌడ కులస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గౌడ కులస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలతోపాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్టేషన్ ను ముట్టించారు. కేసు నమోదు చేస్తే అందరిపై చేయాలని అన్నారు. సమాచారం అందుకున్న భీమ్ గల్ సీఐ పొన్నం సత్యనారాయణగౌడ్ వెంటనే చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు, సిబ్బందిని ఏర్గట్లను పంపించారు. ఏర్గట్ల ఎస్సై రాము కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి, మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తాళ్లరాంపూర్ గ్రామస్తులతో మాట్లాడి శాంతింపజేశారు.
