- లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనం చేసిన షబ్బీర్ అలీ
మాచారెడ్డి, బతుకమ్మ : సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మాచారెడ్డి గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా పేదలకు అందించే ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరై, అధికారులు, ప్రజాప్రతినిధుల తో కలిసి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసి లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ.. సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈరోజు నేను పుట్టిన గ్రామంలో దళితుని ఇంట్లో అన్నం తింటుంటే నా సొంతింట్లో తిన్నట్టు అనిపిస్తుందన్నారు. సన్నబియ్యం పంపిణీతో పేదవాడి కుటుంబం ఆనందంతో పెద్దోలు తినే బియ్యం పేదోలు తింటున్నారని తెలిపారు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ పథకం పేద ప్రజల కడుపు నింపడానికే 80 శాతానికి పైగా బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ నిరుపేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు,

ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు. సన్నబియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలు జరగనివ్వొద్దు. గోదాముల నుంచి బియ్యం రవాణా, రేషన్ షాపుల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేయాలి అని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి ఏమైనా ఫిర్యాదులుంటే పరిష్కరించాలి. ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యం చేరేలా చర్యలు తీసుకోవాలి. డీలర్లుగానీ, అధికారులు గానీ ఏమైనా అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. కోట్లు పెట్టి దొడ్డు బియ్యం పంపిణీ చేసిన అది పక్కదారీ పట్టిందన్నారు. ఇప్పుడు రూ.13వేల కోట్లు వెచ్చించి 30 లక్షల టన్నుల సన్న బియ్యాన్ని పేదలకు అందిస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, సభ్యుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన పేదలందరినీ లబ్ధిదారులుగా నమోదు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదునపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో, ఎంపీడీవో, అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

