నాగిరెడ్డిపేట, బతుకమ్మ : గురువారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ నూతన రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులకు 19 నూతన రేషన్ కార్డు ప్రొసీడింగ్లను, పాత కార్డులలో పేర్ల నమోదైన 71 మంది లబ్ధిదారులకు కూడా ప్రోసిడింగ్ లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద ప్రజల కోరికను తీరుస్తూ తెలంగాణ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు పాత రేషన్ కార్డులో అవసరమైన మార్పు చేర్పులను చేయడం జరిగిందని అన్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు నెలకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా సరఫరా చేయడంతో పాటు ఇతర అనేక పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ఈ రేషన్ కార్డు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో, స్థానిక తాసిల్దార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
