- ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పంజాబ్ లో అక్రమంగా అరెస్టు చేసిన దళితులను వెంటనే విడుదల చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. ప్రజలపై, రైతులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్భంద కాండకు వ్యతిరేకంగా ఏఐకేఎంఎస్ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం నిజాంబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా అనంతరం, జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ జిల్లాలో దళితులు, భూమిలేని నిరుపేదలు భూమి సమస్యపై పోరాడుతున్నారని తెలిపారు. సంగ్రూర్ జిల్లాలో సింధు రాజ్ కుటుంబానికి వెయ్యి ఎకరాల భూమి ఉందని, అతనికి సంతానం లేకపోవడంతో అతను, తన కుటుంబం మరణించిన అనంతరం ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిందని తెలిపారు. అందులో 800 ఎకరాల భూమిని అక్కడి ప్రాంత దళితులు, భూమిలేని పేదలు తమకు ఈ భూములు ఇవ్వాలని జమీన్ ప్రాప్తి సంఘర్షణ కమిటీ జడ్పీఎస్సీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నారని తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం అక్కడి దళితులను, భూమిలేని పేదలను జడ్పీఎస్సీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిందన్నారు. ఢిల్లీలో కేజ్రీవల్ నాయకత్వం లోని ఆప్ పార్టీ ఓడిపోయినా నేపథ్యంలో, పంజాబ్ లో ఉన్న ఆప్ ప్రభుత్వం కూడ ఆ ప్రాంతంలో భూములు అడిగిన, పేదలను, రైతులను జైల్లో పెట్టిందని తెలిపారు. జైల్లో ఉన్న వారిని వెంటనే విడుదల చేసి, ఆ ప్రాంతంలో భూమి లేని దళితులకు, పేదలకు ఈ భూములు పంచి వారిపై మోపిన అక్రమ కేసులను విరమించుకుని వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి డి.సాయి రెడ్డి, ఉపాధ్యక్షులు బి. సాయిలు, అగ్గు ఎర్రన్న, శ్రీనివాస్ రెడ్డి, గోపాల్, బుచ్చన్న, బి.గంగాధర్, ఆర్. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
14523
