నాగిరెడ్డి పేట, బతుకమ్మ :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్లో సోమవారం సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, నాగిరెడ్డిపేట సబ్ ఇన్స్పెక్టర్ ఐ. ఎ. భార్గవ్ గౌబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, సైబర్ మోసాలకు గురైన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు. అలాగే బ్యాంకు అధికారులు గానీ, పోలీసు అధికారులు గానీ ఎప్పటికీ ఓటీపీలు అడగరని, కాబట్టి ఎవరికీ కూడా ఓటీపీలు చెప్పవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, శేషరావు, పీసీలు ప్రభాకర్, సాయిలు మాటలు, పాటల ద్వారా ప్రజలకు సైబర్ నేరాలపై చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి షీ టీమ్ పీసీ శ్రీశైలం, డబ్ల్యూపీసీ సుప్రజ, బ్యాంక్ మేనేజర్ సాగర్ షిండే, బ్యాంక్ సిబ్బంది, అలాగే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బ్యాంక్ ఖాతాదారులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన పోలీసు సిబ్బంది, బ్యాంకు అధికారులను ప్రజలు అభినందించారు.
