నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా లో నిర్వహించబడుతున్న నీట్ 2026 పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా పర్యవేక్షించారు. ఆదివారం గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ (ఆటోనోమస్) హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ బ్లాక్ లోని పరీక్ష కేంద్రాన్ని ఆయన క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీస్ అధికారులను సూచించారు.

పరీక్ష కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. అలాగే పరీక్షల నిబంధనలు కచ్చితంగా అమలు కావాలనే దృష్ట్యా, సెక్యూరిటీ చెక్లను కఠినంగా నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని కమిషనర్ తెలిపారు. నగర ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి పరీక్షల నిర్వహణ విజయవంతం కావడానికి తోడ్పడాలని కోరారు. సీపీ వెంట ప్రిన్సిపాల్ రామ్ మోహన్ రెడ్డి, అబ్సర్వర్స్ డాక్టర్ మహేందర్, డాక్టర్ ఘంటా చంద్రశేఖర్, నిజామాబాదు టౌన్ సి. ఐ శ్రీనివాస్ రాజ్, 3 టౌన్ ఎస్ ఐ హరి బాబు తదితరులు ఉన్నారు.