రుద్రూర్, బతుకమ్మ :
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కు సహకారం అందించాలని గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అంబం(ఆర్), రాయకూర్ క్యాంప్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్ తదితర గ్రామాలల్లో సర్పంచ్ లు గురువారం ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా బిఎల్ఓ లు ఇంటింటికి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచులు గ్రామస్తులకు ఎస్ఐఆర్ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఓటరు జాబితాను సమగ్రంగా సవరించే ప్రక్రియ చేపట్టారని, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించి, 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లకు నమోదు చేసే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయి, వివిధ గ్రామాల సర్పంచులు ఇందూరు సునీత చంద్రశేఖర్, కుర్లెపు గంగాధర్, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.
