. . . ప్రజా కవి వాగ్దాయకారుడు జయరాజ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
విప్లవోద్యమ చరిత్రలో అరుణోదయ నాగన్న గొంతు చిరస్మరణీయమని ప్రముఖ ప్రజాకవి వాగ్గేయకారుడు జయరాజ్ అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ పరకాల నాగన్న సంస్మరణ సభ శనివారం నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్ లో అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య వక్త జయరాజ్ మాట్లాడుతూ సూర్యుడు రాకముందే నిద్రలేపేది నాగన్న పాట అని, రాత్రి జోల పాట పాడేది పల్లెల్లో వెలుగులు నింపేది నాగన్న పాటేనని, సాధారణ జీవితముతో ఎంతో ఆదర్శంగా తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారనీ, ఎందరో అమరవీరుల త్యాగాలు ఆయన గొంతును అమలుకొని ఉద్యమ స్ఫూర్తిని నింపాయని అన్నారు. నాగన్న పాటలతో ప్రభుత్వాలను ప్రశ్నించాడు, నిర్బంధాలను జైళ్లను సైతం చవిచూసి ఏనాడు వెనకడుగు వేయకుండా ప్రజా ఉద్యమంలో నిలిచాడు అని కొనియాడాడు. మార్క్సిజం, లెనినిజం ప్రజా ఉద్యమాలలో నాగన్న ను నిలబెట్టాయని వారు పేర్కొన్నారు. మట్టి మనిషి అని, ప్రజల మనిషి అని మహా మనిషిగా నిలిచాడని అన్నారు. ఒగ్గు కథ బుర్రకథ నిత్య ప్రదర్శనలు తన పాటలతో నిత్యం ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజా ఉద్యమాలను ప్రజా సంఘాలను విస్తృతపరిచాలని, అరుణోదయ సంస్థకు ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సాంస్కృతిని కాపాడాలని ప్రజా ఉద్యమాలను నిర్మించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా అధ్యక్షుడు ఎస్.కే.అబ్దుల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రచయిత బి.నాగభూషణం, ఏఐకెయంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య, జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య, పి వో డబ్ల్యు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పిట్ల సరిత, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిర్ప లింగం, అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పరుచూరి శ్రీధర్, సూర్య శివాజీ, భూమన్నా, పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షులు గౌతం కుమార్, సూరిబాబు, సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

