నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
యువతను నాయకత్వం వైపు ప్రోత్సహించడంలో సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. మేరు సంఘం నిజామాబాద్ జిల్లా, నగర, అనుబంధ సంస్థల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నగరంలోని మేరు సంఘంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేరు సంఘం సామాజిక సేవ, ఐక్యత, అభివృద్ధి దిశగా నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల మధ్య సమన్వయం పెంచుతుందని ప్రశంసించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో సంఘాల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సంఘం భవిష్యత్తులో మరింత బలోపేతమై, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు సోమ హన్మంత్ రావు, నగర అధ్యక్షులు వెన్ను దేవానంద్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా, నగర, అనుబంధ సంస్థల నాయకులు, ఆలయ కమిటీ, టైలర్ కమిటీ సభ్యులు, సీనియర్ సభ్యులు, యువజన విభాగ ప్రతినిధులు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

