బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని వార్డు నంబర్లు 33, 35, 4, 36 మరియు 37 ప్రాంతాల్లో గురువారం కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు మున్సిపల్ కమిషనర్ చేరుకున్నారు. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన స్వయంగా తెలుసుకుని, తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. వర్షపు నీరు సురక్షితంగా బయటకు వెళ్లేలా పంపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని, అలాగే కాల్వలు, డ్రెయినేజీలను వెంటనే శుభ్రం చేయాలని సూచించారు. ప్రజలతో మాట్లాడిన కమిషనర్, అత్యవసర సేవల కోసం ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉంచామని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అవసరమైతే తాత్కాలిక ఆశ్రయ కేంద్రాల్లో వసతి, ఆహార సదుపాయాలను కూడా కల్పిస్తామని భరోసా ఇచ్చారు. బోధన్ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి, వర్షాలు కొనసాగుతున్నంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

