నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ లో కొనసాగుతున్న నిజామాబాద్ నార్త్ మండల కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను సందర్శించి ఆయా సబ్జెక్టులపై ప్రశ్నలు వేసి విద్యార్థినుల సామర్ధ్యాన్ని అంచనా వేశారు. కలెక్టర్ తానే స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో పలు అంశాలను బోర్డుపై రాసి బాలికలకు బోధించారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బిస్కేట్లను విద్యార్థినులకు అందించారు. భోజన విరామ సమయంలో పలువురు బాలికలు చెస్ ఆడుతుండడాన్ని గమనించిన కలెక్టర్ తాను కూడా వారితో కలిసి నేలపై కూర్చుండి ఎంతో ఆసక్తితో చదరంగం ఆడారు. బాలికలను ఆప్యాయంగా పలకరిస్తూ ఇష్టపడి చదువుకోవాలని వారిలో స్పూర్తిని పెంపొందింపజేశారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్ తదితరులు ఉన్నారు.


