బతుకమ్మ భిక్కనూరు: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలను గ్రామ సభల్లో తెలియపరచి ఆమోదం తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం భిక్కనూరు మండలం భాగీర్తిపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభల్లో కలెక్టర్ పాల్గొని కౌంటర్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాగుకు యోగ్యంగా ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల వివరాలు గ్రామ సభల్లో తెలియజేయాలని అన్నారు. భూమిలేని పేదలు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజుల పనిచేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద లబ్ది పొందవచ్చని తెలిపారు. కొత్త రేషన్ కార్డు ల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు వచ్చిన దరఖాస్తుల పై విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. నాలుగు పథకాలకు సంబంధించి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ గ్రామ సభలలో దరఖాస్తులు సమర్పించవచ్చుని తెలిపారు. భిక్కనూరు మండల ప్రత్యేక అధికారిని అధికారిణి రజిత మాట్లాడుతూ నాలుగు పథకాలు ఈ నెల 26 నుండి ప్రారంభం అవుతాయన్నారు . ఈ నాలుగు పథకాలకు సంబంధించి ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న వారి ముసాయిదా జాబితాలను గ్రామ సభలో ఆమోదించవలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్ రెవిన్యూ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.
