మెండోరా, బతుకమ్మ : ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ఆనుకుని దిగువన గల పోచంపాడ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి కోసం చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంబూషియా చేప పిల్లలను పెంచుతున్న ఫిష్ పాండ్స్ ను సందర్శించారు. గంబూషియా చేప పిల్లలను పెద్ద సంఖ్యలో పెంచాలని, దోమలు వృధ్ధి చెందకుండా మురుగు నీటి కాల్వలు, నిలువ నీటి గుంతలలో ఈ చేప పిల్లలను వదలాలని కలెక్టర్ సూచించారు. ముందుగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని వార్డులలో మురుగు కాలువలలో గంబూషియా చేప పిల్లలను వదలాలని, అనంతరం బోధన్ భీమ్గల్ మున్సిపాలిటీలలో కూడా వదిలేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, పూర్తి లక్ష్యం మేరకు నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి జరిగేలా చూడాలని, ఉత్పత్తి కేంద్రంలో పైప్ లైన్ లు, ఇతర మరమ్మత్తు పనులు వెంటనే చేయించాలని జిల్లా మత్స్య శాఖ అధికారి ఆంజనేయ ప్రసాద్ కు కలెక్టర్ సూచించారు.

