నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఈ నెల 21 న జరగనున్న నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నాగారంలో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్ష నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న సదుపాయాలు పరిశీలించారు. ప్రశ్న పత్రాలను తరలించే రూట్ మ్యాప్ ను సైతం స్వయంగా పరిశీలించారు.

కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే అభ్యర్థులను లోనికి అనుమతించాలని, అభ్యర్థులతో పాటు సిబ్బంది కూడా ఏ ఒక్కరూ సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తేకూడదని అన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రాల్లోని ఆయా గదుల వివరాలను తెలియజేసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీటి వసతితో పాటు ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎం లను నియమించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఏ చిన్న తప్పిదానికి సైతం అవకాశం లేకుండా నీట్ ప్రవేశ పరీక్షను పక్కాగా నిర్వహించాలని, సీ.సీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరగాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.15 గంటల వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.

