హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులలో తొలి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీలు, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్ లో మొత్తం 200 సీట్లు ఉంటాయి. వీటిలో పోలీస్ సిబ్బంది కుటుంబాల పిల్లలకు 100 సీట్లు, మరో 100 సీట్లు సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించారు. ఒక్కొ తరగతిలో 40 మంది చొప్పున ఐదు క్లాసుల్లో కలిపి 200 మంది విద్యార్థులు ఉంటారు. ఇప్పటి వరకు 83 మంది పోలీసు, నలుగురు సాధారణ పౌరుల పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చారు. సీబీఎస్ఈ సిలబస్, అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన ఉండనుంది.
