. . . పలువురికి గాయాలు
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చెద్మల్ తండాలో భూ వివాదం నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య మంగళవారం ఘర్షణ చోటుచేసుకుంది. భూమికి సంబంధించిన తగాదాలు తీవ్రరూపం దాల్చడంతో ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘర్షణలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఇరు వర్గాల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు గల కారణాలు, భూ వివాదానికి సంబంధించిన అంశాలపై విచారణ కొనసాగుతున్నట్లు గాంధారి పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో చెద్మల్ తండాలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
