మాజీ ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ మార్పు ఎందుకు చేశారో తమకైతే తెలువదని, కనీసం వారికి ఓటు వేసి గెలిపించిన ప్రజలకైనా స్పష్టత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ వీ. గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు రాష్ట్ర అస్తిత్వంపై, సంస్కృతి సంప్రదాయాలపై దాడి చేయడమేనని ఆయన అన్నారు. ఇదివరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ రూపన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హఠాత్తుగా మార్చాల్సి వచ్చిందో, అందుకు గల అభ్యంతరాలు ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ పై ఉందన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, జడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, రాంకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
