ఏర్గట్ల, బతుకమ్మ :
తడపాకల పెద్ద వాగు ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి చేసింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, సి.సి.ఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది అక్రమ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఏర్గట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తడపాకల పెద్దవాగు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో చీతా ఫోర్స్ బృందం ఆకస్మిక దాడి నిర్వహించింది. దాడిలో అక్రమ ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న ఒక జేసిబి యంత్రం, నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ప్రకృతి వనరుల దోపిడీకి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చర్యల నిమిత్తం ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కి అప్పగించారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించే అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక దృష్టి సారించిందని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.

