. . . అంతర్గాం, అంబారీపేట ల వద్ద అండర్ పాస్ లు మంజూరు
. . . ఎంపీ అర్వింద్ ధర్మపురి కి లేఖ ద్వారా తెలియజేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
. . . కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియజేసిన ఎంపీ అర్వింద్
జగిత్యాల, బతుకమ్మ :
జగిత్యాల జిల్లా ప్రజలకు కేంద్రం మరో శుభవార్త తెలియజేసిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి తెలిపారు. జగిత్యాల – కరీంనగర్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ – 563) అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. అంబారిపేట్, అంతర్గాం గ్రామాల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం కోసం తాను కేంద్ర రహదారులు, రవాణా శాఖ దృష్టికి తీసుకెళ్లిన అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి అధికారిక స్పందన వచ్చినట్లు తెలిపారు. జగిత్యాల – కరీంనగర్ రహదారిని 4 లేన్లుగా విస్తరించడంతో పాటు జగిత్యాల పట్టణానికి బైపాస్ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా అంతర్గాం, అంబారీపేట గ్రామాల వద్ద అండర్ పాస్ ల నిర్మాణానికి సైతం ఆమోదం లభించిందన్నారు. ఈ పనులు పూర్తయిన అనంతరం ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. జగిత్యాల జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి నిరంతరం కృషి కొనసాగిస్తానని ఎంపీ అరవింద్ ధర్మపురి పేర్కొన్నారు. జిల్లా ప్రజల తరఫున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

