నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలంలోని పలు గ్రామాలలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను, కల్లాలలో తడిసిపోయిన ధాన్యం కుప్పలను, తెగిపోయిన చెరువులను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడారు. మండల వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించే విధంగా అధికారులు పనిచేయాలని కోరారు. రైస్ మిల్లు యజమానులు ధాన్యం రంగు మారిందని, తడిసిపోయిందని కొర్రెలు పెడుతూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి రైతులను ఇబ్బంది పెడుతున్న రైస్ మిల్లు యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగు మారిన ధాన్యాన్ని కూడా రైస్ మిల్లర్లు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్, షాపూర్ మాజీ సర్పంచ్ మురళి, నందిపేట్ గ్రామ శాఖ అధ్యక్షుడు భాస్కర్, ఉప సర్పంచ్ భరత్, నాయకులు దుబాయ్ శీను, భోజేందర్ చిన్నయ్య, దేవన్న, నవీన్, గంగాధర్, ముత్యం తదితరులు పాల్గొన్నారు.

