నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బీఎల్టీయూ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2026 సంవత్సరపు క్యాలెండర్ ను నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ దిలీప్ కుమార్ శుక్రవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఎల్టీయూ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించడమే కాకుండా, ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చిన మహనీయుల జయంతులు వర్ధంతులతో ముద్రించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బీఎల్టీయూ ప్రభుత్వ సెలవులతోపాటు భారతదేశంలో బహుజన శ్రామిక ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కోసం జరిగిన ఉద్యమాలకు నాయకత్వం వహించిన గౌతమ బుద్ధుడు, సావిత్రమ్మ, మహాత్మా జ్యోతి బా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ నారాయణ గురుల నుండి ప్రపంచ కార్మిక వర్గ రాజ్య నిర్మాతలైన కారల్ మార్క్స్, లెనిన్, స్టాలిన్ మావో, చేగువేరా జయంతుల వరకు తమ క్యాలెండర్ లో పొందుపర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సబ్బని లత, యూనియన్ నాయకులు కొమ్ము రాహుల్, ఆర్. మురళి, బీఎల్టీయూ నగర ప్రధాన కార్యదర్శి గౌడెల్లి గంగా శంకర్, హైమద్ పాషా లు పాల్గొన్నారు.
