నిజామాబాద్, బతుకమ్మ : సీతా రాముల కల్యాణం చూసిన, విన్న వారి జన్మ ధన్యం అవుతుందని వేద పండితులు, పురోహితులు నంభి నరహరి అన్నారు. వినాయక నగర్ లోని శ్రీ పంచ ముఖి హనుమాన్ ఆలయంలో ఆదివారం శ్రీ సీతా రాములు కల్యాణాన్ని హిందూ వాహిని, హైందవ సేన ఉత్సవ సమితి, పంచముఖి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నంభి నరహరి, శౌర్య, కృష్ణ పురోహితులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంభి నరహరి ప్రవచనం చేశారు. భక్తితో చేసిన ఏ పూజ అయిన భగవంతుడు ఇష్ట పడతారని అన్నారు. సనాతన ధర్మం అంటే హిందూ మతం, వైదిక ధర్మం, ఇది శాశ్వతమైన, సర్వకాలికమైన, సృష్టికి మూలమైన ధర్మం అని నమ్మకమన్నారు. ఇది కేవలం ఒక మతం కాదని, ఒక జీవన విధానమన్నారు. ఇది మానవ జీవితం, విశ్వం యొక్క సత్యాలను వివరిస్తుందని,”సనాతన” అంటే శాశ్వతం, “ధర్మం” అంటే సత్యం, దీనిని వైదిక ధర్మం అని కూడా అంటారని తెలిపారు. అనంతరం ఆలయంలో తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ కమిటీ సభ్యులు, హిందూ వాహిని, హైందవసేన ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
