- రాజన్న ఆలయ దర్శనాన్ని నిలిపివేస్తే ఊరుకునేది లేదు
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనాన్ని ఆలయ అభివృద్ధిలో భాగంగా దర్శనాన్ని నిలిపివేస్తున్నామని ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి,నిరసన తెలిపారు.కామారెడ్డి -సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. దిష్టిబొమ్మను దహనం చేసే ప్రక్రియలో పోలీసులు అక్కడికి చేరుకొని దిష్టిబొమ్మను లాక్కునే ప్రయత్నం చేయగా పోలీసులకు,బిజెపి నాయకులకు తోపులాట జరిగాయి.. అనంతరం బిజెపి నాయకులు దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి,మండల అధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి లు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పేరుతో భక్తులకు దూరం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిత్య దర్శనం నిలిపివేస్తున్నామని అధికారులు ప్రకటన విడుదల చేయడంతో రాజన్న భక్తులకు, హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి మేము అడ్డం కాదని ఆలయాన్ని మూసి వేయకుండా అభివృద్ధి పనులు చేస్తూ భక్తులకు దైవదర్శనాన్ని కల్పించాలని అన్నారు. భీమన్న ఆలయంలో సేవలు కొనసాగిస్తామంటే ఒక దేవునికి చేసే పూజలు మరొక దేవునికి ఎలా చేస్తారని తీవ్రంగా మండిపడ్డారు. హిందువుల మనోభావాలు,రాజన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

