నిజామామాద్, బతుకమ్మ : బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. శనివారం నగరంలోని ఆర్అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కట్టుబడి ఉన్నామని అమలు చేస్తామన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడంలో ప్రధాన ముద్దాయి బీజేపీయే అని ఆరోపించారు. బనకచర్ల, బీసీ రిజర్వేషన్లపై బీజేపీ – బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయని పేర్కొన్నారు. బనక చర్ల విషయంలో మంత్రి హరీష్ రావు మురికిని కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బనక చర్ల జీవోలు వెలువడ్డాయని పేర్కొన్నారు. ఆంధ్రా హక్కులను కాపాడతానన్నది కేసీఆర్ కదా అని ప్రశ్నించారు. జగన్తో కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకుని విందులు, వినోదాలు చేసుకున్నారని, ప్రజల హక్కుల విషయంలో మాత్రం మౌనం వహించారని మండిపడ్డారు. బనక చర్ల పై మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో వివరించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కుల సర్వే చారిత్రాత్మక నిర్ణయమని పారదర్శకంగా నిర్వహించామన్నారు. మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ లు బీసీల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్ నుంచి ముంబై వయా నిజామాబాద్ రైల్వే లైన్ తో విషయమై సీఎం చర్చించానని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా కృషి చేస్తానని తెలిపారు. కామారెడ్డి బీసీ సభ తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
