బాన్సువాడ, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బాన్సువాడ పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులకు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితా, పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఫోటో ఓటర్ల జాబితాలను కమిషనర్ బి. శ్రీహరి రాజు అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ పేరు ఓటర్ల జాబితాలో నమోదైందో లేదో పరిశీలించుకోవాలని, ఎలాంటి తప్పులు ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎన్నికల రోజున ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కార్యాలయ సిబ్బంది, ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు.
