బతుకమ్మ భిక్కనూరు: భూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. భూ భారతి చట్టం పై అవగాహన సదస్సులను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా మంగళవారం భిక్కనూరు రైతువేదికల్లో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం 14 ఏప్రిల్ 2025 న ప్రారంభించడం జరిగిందని . చట్టం పై ప్రజలకు, రైతులకు అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధరణీ స్థానంలో భూ భారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని, 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామ ద్వారా కొనుగోలు చేసి, గడచిన 12 ఏండ్లుగా అనుభవంలో ఉంటూ 12.10.2020 నుండి 10.11.2020 మధ్య కాలంలో క్రమబద్దీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓ లు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ , స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. అట్టి వాటిని రికార్డు లలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. పాసు పుస్తకాలలో భూమి పటం, భూముల సమస్యలు పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్త ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీచేసిన పాసుపుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ కు అప్పీలు చేసుకోవచ్చని, ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ తరహాలో రైతులకు భూదార్ కార్డుల జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే నివృతం చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి భిక్కనూరు సదస్సులో మాట్లాడుతూ, రైతుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకురావడం జరిగిందని, ఈ చట్టం ద్వారా రైతుల సమస్యలు తీర్చాలని కలెక్టర్ ను కోరారు. ఈ సదస్సులోఆయా మండల తహసీల్దార్లు,ఎంపీడీఓ లు, రెవిన్యూ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు, పలువురు ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

