నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కోటగల్లిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో శిక్షణ పొందుతున్న మహిళలకు జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు ఘన్పూర్ వెంకటేశ్వర్లు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్పీవీ టీకా ప్రాముఖ్యతను వివరించారు. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్పీవీ) వల్ల మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ క్యాన్సర్ను నివారించేందుకు 14–15 సంవత్సరాల బాలికలకు హెచ్పీవీ టీకా ఇస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 160కు పైగా దేశాల్లో ఈ టీకా వినియోగంలో ఉందని, ఇప్పటివరకు 50 కోట్లకు పైగా బాలికలకు అందించారని పేర్కొన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ సురక్షితమైందని, సంతానోత్పత్తి లేదా నెలసరి చక్రంపై ఎటువంటి ప్రభావం ఉండదని అపోహలను ఖండించారు. ఈ టీకా గర్భాశయ క్యాన్సర్ నుంచి 93–100 శాతం వరకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎంఈఓ సాయిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, ఇన్స్ట్రక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు.

