. . . మెడికవర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా. గ్రీష్మిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
సెర్వికల్ క్యాన్సర్ మహిళల్లో ఎక్కువగా కనిపించే ప్రధాన క్యాన్సర్లలో ఒకటి, దీనిపై సరైన అవగాహనతో పాటు ముందస్తు పరీక్షలు చేయించుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని మెడికవర్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా. గ్రీష్మిక తెలిపారు. మంగళవారం నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్ లో విలేఖరులతో సెర్వికల్ క్యాన్సర్ మంత్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. . . ముప్పై సంవత్సరాల పైబడిన వయస్సు ఉన్న ప్రతి మహిళ క్రమం తప్పకుండా పాప్ స్మియర్ టెస్ట్, హెచ్ పి వి స్క్రీనింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే పూర్తిగా చికిత్స సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.అసురక్షిత లైంగిక సంబంధాలు, హెచ్ పి వి వైరస్ సంక్రమణ, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, పొగతాగడం వంటి కారణాల వల్ల సెర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డా. గ్రీష్మిక వివరించారు. అలాగే హెచ్ పి వి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఎలాంటి లక్షణాలు లేకపోయినా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అవగాహనే సెర్వికల్ క్యాన్సర్పై ప్రధాన ఆయుధమని డా. గ్రీష్మిక అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ సెంటర్ హెడ్ కె. స్వామి, డీసీఎంఎస్ డా. యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్ పాల్గొన్నారు.

