. . . ట్రాన్స్ జెండర్లతో కలిసి కాంగ్రెస్ నేతల ఆందోళన
. . . కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ, అసలు నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి విద్యార్థులపై దాడులు చేయడం దారుణమని నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా బుధవారం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్ నాయకులు జరీనా, గంగా తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. నగరంలోని 11వ డివిజన్ బహుజన కాలనీలో డీసీసీ కార్పొరేషన్ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ సమన్వయంతో అంబేడ్కర్ చిత్రపటం వద్ద ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ట్రాన్స్ జెండర్ కాంగ్రెస్ నాయకులు అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి, కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ, అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం సాక్షిగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేంద్ర ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్య వాణిని అణచివేసే ప్రయత్నంలో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయని ఆరోపించారు.

నీట్ అక్రమాలు, అవకతవకల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొన్నారు. న్యాయం, జవాబుదారీతనం కోసం జరిగే ప్రజాస్వామ్య పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. యువత హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. “మమ్మల్ని జైల్లో పెట్టవచ్చు, అణచివేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ న్యాయం కోసం పోరాడుతున్న లక్షలాది మంది యువ భారతీయుల స్వరాన్ని అణచివేయలేరు” అని అన్నారు. నీట్ పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలకు నిరసనగా రామకృష్ణతో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రతీకాత్మకంగా ఒకరి చేతులకు ఒకరు తాడుతో సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, కార్పొరేటర్లు కరీం, అన్వర్, నయీం, నవాజ్, ముదసిర్, అవీన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

