ఎల్లారెడ్డి, బతుకమ్మ : చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి.మహేష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో డిసెంబర్ 16న మహమ్మద్ ఫరూక్ అహ్మద్ తన ఇంటి ముందు ఉన్న గోదాం నుంచి సుమారు రూ. 50,000 విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఫరూక్ అహ్మద్ గోదాం నుంచి వస్తువులు దొంగతనానికి పాల్పడిన నిందితుడు నాగరాజు అని నిర్ధారించారు. అతన్ని అరెస్టు చేసి, విచారణ పూర్తయ్యాక ఎల్లారెడ్డి కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ నిందితుడికి రిమాండ్ విధించారు. విచారణలో నాగరాజు గత నెలలో ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని తెలంగాణ భవన్లో మహమ్మద్ అబ్దుల్ ఘనీకి చెందిన బిర్యానీ సెంటర్ షట్టర్ సహా ఇతర దుకాణాల షట్టర్లను లేపి దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి దొంగతనానికి పాల్పడిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
