ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ ఆర్టిఏ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ ఎసిబి రేంజ్ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం ఆర్మూర్ ఎంవీఐ గుర్రం వివేకానంద రెడ్డి రూ.25 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఒక వాహనంపై చెక్ లిస్ట్ విషయంలో క్లియరెన్స్ కోసం ఏజెంట్ ద్వారా బాధితుడినుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలో వరుసగా కామారెడ్డి జిల్లాలో ని అంతర్ రాష్ట్ర సరిహద్దు ఆర్టీఏ చెక్ పోస్ట్ సలాబత్ పూర్ , జాతీయ రహదారిపై ఉన్న కామారెడ్డిలోని చెక్ పోస్టులపై దాడులు చేసిన ఎసిబీ ఆకస్మిక తనిఖీలు చేసి లెక్కకు మించిన డబ్బులు స్వాధీనం చేసుకున్న ఘటనలో విధి నిర్వహణలో ఉన్న అధికారులపై చర్యలు సిపారసు చేశారు. చాలా రోజుల తర్వాత ఉమ్మడి జిల్లా లో రవాణా శాఖాధికారులు రెడ్ హ్యాండేడ్ గా దొరకడం విశేషం.
