. . . సిపిఎం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
భగత్ సింగ్ 95 వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాందేవ్ వాడలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుండి భగత్ సింగ్ చిత్రపటం తో పార్టీ కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు. అనంతరం హమాల్ వాడి చౌరస్తాలో జరిగిన సమావేశం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, జిల్లా కార్యదర్శి రమేష్ బాబు లు మాట్లాడుతూ భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన 23వ సంవత్సరంలోనే వలస పాలన నుండి భారతదేశం విముక్తి కావాలని పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో పాటు పార్లమెంట్ లోపల పొగ బాంబ్ లను విసిరి తమ నిరసనను వ్యక్తం చేసి భారతదేశాన్ని నినదించిన గొప్ప వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవులు అని వారి పోరాట స్ఫూర్తితో అనేకమంది యువకులు బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కదిలి వచ్చారని తెలిపారు. అతి చిన్న వయసులోనే వారికి ఉరి శిక్ష విధించినప్పటికీ ఏమాత్రం బెదరకుండా ఈ దేశంలో దోపిడీ లేని అసమానతలు లేని సమాజం నిర్మించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకు బ్రిటిష్ సామ్రాజ్య వాదాన్ని వ్యతిరేకించాలని పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ నేటి పాలకులు అమెరికన్ సామ్రాజ్యవాదుల ముందు మోకరిల్లుతున్నారని పెట్టుబడుదారులు ఈ విధానాలకు అనుగుణంగా బలహీన వర్గాల పైన భారాలు మోపుతున్నారని వారు విమర్శించారు. సామ్రాజ్యవాదం అనేది ఎన్నటికైనా తృతీయ ప్రపంచ దేశాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకుని పెట్టుబడుదారుల లాభాలే పరమావధిగా పని చేస్తారని అందువలన పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే సింకు నిజమైన నివాళి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్, మరియు నగర నాయకులు నల్వాల నరసయ్య, అనసూయ, అనిత, మాధవి, రాజు, ఏంషుద్దీన్, సతీష్, కిరణ్ తదితరులతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

