- జమ్ము, పంజాబ్, రాజస్తాన్ లోని పలు ప్రాంతాలు లక్ష్యంగా ప్రయోగించిన పాక్
- గట్టిగా జవాబిచ్చిన భారత్..
- పాకిస్తాన్ డ్రోన్లు నేలమట్టం
- ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేసిన భారత్
ఢిల్లీ, బతుకమ్మ : పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. గురువారం కవ్వింపు చర్యలకు దిగుతూ భారత్ లోని పలు చోట్ల డ్రోన్లు, మెస్సైళ్లతో దాడికి దిగింది. శుక్రవారం కూడా డ్రోన్లతో దాడికి దిగింది. జమ్ము, పంజాబ్, రాజస్తాన్ లోని పలుచోట్ల పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయి. భారత సైన్యం వెంటనే అలర్ట్ అయింది. వెంటనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను భారత్ యాక్టవేట్ చేసింది. పాకిస్తాన్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నేలకూల్చాయి. పాకిస్తాన్ నుంచి దాడులను ఊహించిన భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలో భాగంగా సరిహద్దు రాష్ట్రాల్లో అలర్ట్ ప్రకటించింది. సైరన్ల మోత మోగించింది. ప్రజలు జాగురూకతగా వ్యవహరించాలని సూచించింది. గురువారం పాకిస్తాన్ సుమారు 300 నుంచి 400 డ్రోన్లతో భారత్ పైకి దాడికి దిగిందని శుక్రవారం కేంద్రం ప్రకటించింది. ఇవన్నీ టర్కిష్ సోంగార్ మోడల్ డ్రోన్లు అని వివరించింది. మన దేశంలోని 36ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్లు పాకిస్తాన్ ప్రయోగించింది. కాగా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వీటిని సమర్థంగా అడ్డుకున్నాయి. పాకిస్తాన్ లోని నాలుగు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ ప్రతిదాడి చేసిందని, ఇందులో లాహోర్ లోని ఓ ఎయిర్ డిఫెన్స్ కు చెందిన రాడార్ వ్యవస్థ ధ్వంసమైనట్లు తెలిపింది.
